అమరావతి: నగరి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన బాలాజీ జిల్లాలో కలపాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. గురువారం ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కలసి వినతిపత్రం అందచేశారు. అలాగే, మండల, మున్సిపాలిటీ కార్యవర్గాలు చేసిన తీర్మానాల కాపీలను కూడా ఆయనకు అందించారు. తిరుపతితో నగరి నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధాన్ని సమీర్ శర్మకు వివరించారు.
తిరుపతి పట్టణానికి 9 కిలోమీటర్ల దూరం నుంచి నగరి నియోజకవర్గం ప్రారంభమవుతుందని రోజా తెలిపారు. నగరి నియోజకవర్గం మొత్తం తిరుపతికి వెళ్లే జాతీయ రహదారిని ఆనుకునే ఉంటుందని చెప్పారు. నగరి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలు తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అథారిటీకి ఆస్తి పన్ను చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. పుత్తూరు, నగరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాలాజీ జిల్లా పేరిటే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సమీర్ శర్మ దృష్టికి తీసుకొచ్చారు. నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.