బెంగుళూరు: సినీ నటి, ఎమ్మెల్యే రాజా ప్రయాణిస్తున్న విమానం బెంగుళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని .. సాంకేతిక కారణాల వల్ల బెంగుళూరుకు మళ్లించారు. వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా మొబైల్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ విమానంలో టీడీపీ నేత యనమల రామకృష్ణ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి విమానాశ్రయంలో విమానం దిగేందుకు అనుమతి రాలేదు. దీంతో సుమారు గంట పాటు విమానం గాలిలోనే చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోజా తన వీడియో ద్వారా తెలిపింది. చాలా సేపు విమానం గాలిలో తిరగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనైనట్లు ఆమె వెల్లడించారు. అయితే తిరుపతికి దగ్గరగా ఉన్న కడపలో కాకుండా ఆ విమానాన్ని బెంగుళూరుకు ఎందుకు మళ్లించారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ప్రయాణికులు బటయకు వెళ్లడానికి అనుమతించడం లేదన్నారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయి నాలుగు గంటలు అవుతున్నా.. ఇంకా విమానం డోర్లను తీయడం లేదన్నారు. తనకు మేజర్ సర్జరీ జరిగిందని, కడపులో 29 కుట్లు ఉన్నాయని, అయితే ఎక్కువ సమయం కుర్చీలో కూర్చవడం ఇబ్బందిగా మారుతోందని రోజా తెలిపారు. రాజమండి నుంచి ఇండిగో విమానం ఉదయం 9.20 నిమిషాలకు బయలుదేరింది. తిరుపతికి ఆ విమానం 10.20 నిమిషాలకు చేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల బెంగుళూరు విమానాశ్రయంలో ఆ విమానాన్ని దింపారు. ఆ విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రోజాతో పాటు ఇతర ప్రయాణికులను విమానం దిగేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.