హైదరాబాద్ : నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కల ఎట్టకేలకు నెరవేరింది. ఆమె చేసిన పూజలు ఫలించాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రోజా అనేక దేవాలయాలను సందర్శించి.. పూజలు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్లో రోజాకు స్థానం లభించింది. దీంతో నగరి నియోజకవర్గ ప్రజలతో పాటు, ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి వర్గంలో రోజాకు చోటు లభించడంతో.. జబర్దస్త్కు గుడ్ బై చెప్పారు. ఇక నుంచి సినిమాలు, షూటింగ్లతో పాటు జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్నట్లు రోజా ప్రకటించారు. దాదాపు పదేళ్లుగా జబర్దస్త్ షోకు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానని రోజా స్పష్టం చేశారు. ఇక రోజాకు ఏ శాఖ కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.