అమరావతి : విశాఖ జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయి. సహచరుల వైఖరితో తీవ్ర మనస్థాపానికి గురైన పార్టీ ఎమ్మెల్యే తనకు అప్పగించిన నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన రాజీనామా పత్రాన్ని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు వైసీపీ రీజినల్ కో ఆర్ఢినేటర్గా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖను పంపారు .
విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్తో రాజకీయ విభేదాలతో తాను పనిచేయలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి అండతో సుధాకర్ రెచ్చిపోతున్నారని, తనను తాను రాబోయే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్థి అంటూ తప్పుడు ప్రచారం చేసు కోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహంతో ఉన్నారు. కాగా వాసుపల్లి గణేశ్ 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొంది వైసీపీలో చేరారు.