అమరావతి : ఏపీలోని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే (Gudiwada MLA) కొడాలి నాని ( Kodali Nani ) ప్రతిపక్ష నాయకులపై మరోసారి సెటైర్లు విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఘాటుగా విమర్శించారు. పవన్కల్యాణ్ను దత్తపుత్రుడు, నారా లోకేష్ను ఉత్తపుత్రుడంటూ అభివర్ణించారు.
కృష్ణాజిల్లాలో జరిగిన కార్యక్రమంలో కొడాలి నాని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేక వదినమ్మ పురందేశ్వరిని ముందుంచి చెల్లెమ్మ షర్మిలను వెనుకాల నిలబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా నుంచి వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారు.
హెలికాప్టర్ లేక భీమవరం పర్యటన వాయిదా వేసుకున్న పవన్కల్యాణ్ (Pawankalyan)ను గెలిపిస్తే హెలికాప్టర్ లేక గ్రామాలకు రానేరాడని దుయ్యబట్టారు. మంగళగిరి నుంచి కేవలం గంటన్నరలో కారులో భీమవరానికి చేరుకోవచ్చని అలా కాకుండా హెలికాప్టర్ ఉంటేనే వెళ్తానంటూ పర్యటనను వాయిదా వేసుకోవడం పై మండిపడ్డారు.