విజయనగరం జిల్లా : ఆంధ్రప్రదేశ్ మంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇచ్చేందుకు బేరమాడారని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని సాలూరు నుంచి రాజన్న దొర వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘనవిజయం సాధించారు. ఆ సమయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారిలో నలుగురికి మంత్రి పదవులను కూడా దక్కాయని విజయనగరం జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీలో ఈ విషయాలను వెల్లడించారు.
తాజాగా రాజన్న దొర ఆనాటి సంగతులను గుర్తుచేసుకుంటూ టీడీపీ అధినేతపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తనను పార్టీ మారమంటూ తీవ్ర ఒత్తిడి చేశారన్నారు. తమ పార్టీలో చేరాలని ప్రలోభపెట్టారని చెప్పారు. పిల్లల చదువులను తామే చూసుకుంటామని, అలాగే, రూ.30 కోట్ల నగదుతోపాటు అమరావతిలో ఒక ఇల్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని రాజన్న దొర వెల్లడించారు. అయితే తానకు జగన్పై ఎంతో నమ్మకం ఉన్నదని, ఆ నమ్మకమే తాను పార్టీని వీడకుండా చూసిందని రాజన్న దొర తెలిపారు.
అంతలా ప్రలోభపెట్టినా వారి పార్టీలోకి వెళ్లకుండా తానింతకాలం ఎదురు చూసినందుకు మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అందిందని చెప్పారు. తనలా పార్టీకి అంకితభావంతో పనిచేసేవారికి, పార్టీ అధినేతనే నమ్ముకున్నవారికి ఏనాటికైనా ఫలితం అందుతుందని, దానికి తానే నిదర్శనమన్నారు.