ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో వన్ ఇండియా- వన్ బస్ వెబ్సైట్ ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ పూర్తైన తర్వాతే పేర్ని నాని మాట్లాడుతూ.. ఇదే నా చివరి సమావేశం కావొచ్చు. ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు వస్తారు. ఈ అసోసియేషన్తో ఇదే చివరి సమావేశం అని నేను అనుకుంటున్నాను అంటూ పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను కూడా గతంలో ఓ బస్సు ఓనర్గా ఉన్నానని, బస్సు, లారీ ఆపరేటర్ల సాదక బాధకాలన్నీ తనకు క్షుణ్ణంగా తెలుసని పేర్కొన్నారు. రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా.. తాను ఆ మంత్రితో సాధక బాధకాలు మాట్లాడతానని, అవసరమైతే సీఎం వద్దకు కూడా తీసుకెళ్తానని పేర్ని నాని హామీ ఇచ్చారు.
వన్ ఇండియా – వన్ బస్ వెబ్సైట్ను ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి నాని అన్నారు. అయితే అందరూ ఐకమత్యంగా ఉంటేనే.. ఈ కృషి విజయవంతమవుతుందన్నారు. ఈ ఆలోచన అద్భుతమని, కట్టడిగా ఉంటేనే.. ఎక్కువ కాలం నడుస్తుందని, ఎవరు బలహీనంగా ఉన్నా.. ఇబ్బందులు వస్తాయని సున్నితంగా హెచ్చరించారు.