అమరావతి : ఏపీలో టీడీపీ కార్యకర్త (TDP Member) ఆత్మహత్య పట్ల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) భావోద్వేగానికి లోనయ్యారు. తన వీరాభిమాని శ్రీను బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అన్నా.. అన్నా. అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ అంటూ ట్వీట్ (Tweet) చేశారు.
ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మహత్య (Suicide) చేసుకునేంతగా కాదని అన్నారు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదని పేర్కొన్నారు. సారీ శీను..నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా నీ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు.
బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం
కష్టాలొచ్చినప్పుడు ఎవరూ కూడా అధైర్యపడొద్దని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నారా లోకేష్ విన్నవించారు. సమస్యలను కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకుంటే పరిష్కారం దొరుకుతుందని అన్నారు. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని కోరారు.