ఎన్టీఆర్ జిల్లా : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా క్యూలైన్లను, కొండపై ఏర్పాట్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాధారణ భక్తులకు కూడా రూ.500 దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు ఆయన అమ్మవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నదని మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు చెప్పారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ కుటుంబీకులతోపాటు స్నేహితులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలకు దర్శనం చేయించాల్సిన అవసరం ఉంటుందని, తాను కూడా రాజకీయ నేతనైనందున తనకు అన్నీ అనుభవపూర్వకమే అన్నారు. రాజకీయ నేతల ఒత్తిడి మేరకు వారి సిఫారసు లేఖలతో వచ్చిన వారిని అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఒక్కోసారి వంద మందిని పంపాల్సి వస్తుందని నిర్మొహమాటంగా పేర్కొన్నారు. టిక్కెట్ల కేటాయింపులో టెక్నికల్ సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వెల్లంపల్లి తనకు తమ్ముడిలాంటి వాడని చెప్పారు. తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని, ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటామని తెలిపారు. తాము దైవదర్శనం కోసం వెళ్లిన ప్రతిసారీ వెల్లంపల్లికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని కోరేవారమని, ఆయన కూడా తనను కోరుతారని మంత్రి కొట్టు చెప్పారు. ఇద్దరం సమన్వయంతో పనిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.