ప్రకాశం జిల్లా : ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కాన్వాయ్లోని కార్లు ఒక్కసారిగా బ్రేక్లు వేయడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది.
జాతీయ రహదారిపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. డివైడర్పై ఏర్పాటు చేసిన కోన్లు గాలికి ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో మంత్రి కాన్వాయ్లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కాన్వాయ్లోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొట్టాయి. అనంతరం పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినప్పటికీ.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు స్వల్పంగా దెబ్బతిన్నది.
మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మరో కారులో ఎక్కి మంత్రి వెళ్లిపోయారు. హైవే మొబైల్ సిబ్బంది, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తప్పించారు.