కృష్ణా జిల్లా : అమరావతినే రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు కామెంట్స్ చేశారు. అది ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేయూత నగదు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ప్రసంగించారు.
అమరావతి రాజధానిగా కావాలంటూ కొందరు బలిసినోళ్లు, ధనవంతులు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు. సంపాదన ఎక్కువై ఒళ్లు బలిసిపోయి ఉన్న కొంత మంది తమ బలుపును తగ్గించుకోవాలన్న ఆరాటంతో ఇలా పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ సర్కార్.. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిందని చెప్పారు. దీనిని సహించలేని కొందరు బలిసినోళ్లు, కోటీశ్వరులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.
తమ కోరికను వెల్లడించేందుకు సాధారణంగా పాదయాత్రలు జరగుతుండగా.. ఇక్కడ మాత్రం విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి విమర్శించారు. కొందరు ఏదో చేస్తామనుకుని తొడలు కొడుతున్నారని, అలా తొడలు కొట్టినంత మాత్రాన వికేంద్రీకరణ నిలిచిపోదన్నారు. ఇప్పటికే కుప్పంలో వైసీపీ పైచేయి సాధించిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. టీడీపీని, చంద్రబాబును కాపాడేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని దుయ్యబట్టారు. ఇలాంటి పార్టీలను నమ్మి ఓటేస్తే రాష్ట్రం అధోగతిపాలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, దివి ఏఎంసీ చైర్మన్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.