Michaung Cyclone | ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్జాం తుఫాన్ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ కారణంగా నెల్లూరు, బాపట్ల, ప్రకాశం సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.కోస్తాంధ్ర తీరానికి అత్యంత దగ్గరగా మిగ్జాం తుఫాన్ కదులుతోందని అంతకుముందు ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్లో కొంత భాగం సముద్రంలో.. మరికొంత భాగం భూమిపై ఉన్నట్లు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాన్ కేంద్రకంలోని మేఘాలు భూభాగంపై ఉన్నట్లు వెల్లడించింది.
#WATCH | Andhra Pradesh | Sea turns turbulent in Bapatla, strong winds and rainfall continue in wake of #CycloneMichuang.
Michaung is likely to make landfall today on the southern coast of Andhra Pradesh between Nellore and Machilipatnam pic.twitter.com/NqQuevHNji
— ANI (@ANI) December 5, 2023
తుఫాన్ కారణంగా తీరప్రాంతాల్లో గంటకు 75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు సూర్యలంక బీచ్లో 4 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం కూడా 100 మీటర్లు ముందుకొచ్చింది. ఉదయం 6.30 గంటల వరకు బాపట్లలో 21.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, నెల్లూరులో 28.95 సెం.మీ., మచిలీపట్నంలో 14.93 సెం.మీ., కావలిలో 14.26 సెం.మీ., ఒంగోలు 11.44 సెం.మీ., కాకినాడలో 5.9 సెం.మీ., నర్సాపూర్లో 5.85 సెం.మీ., అనకాపల్లిలో 3.35 సెం.మీ., పొదలకూరులో 20.75 సెం.మీ., రేపల్లె 1.17 సెం.మీ., చిత్తూరు 1.25 సెం.మీ., నర్సారావుపేట 1.15 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది. తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వరణుడు విరుచుకుపడుతున్నాడు. తుఫాను తీవ్రత దృష్ట్యా నిజాంపట్నం హార్బరులో అధికారులు పదో నంబర్ ప్రమాద సూచిక జారీచేశారు. హార్బర్ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచించారు. నిజాంపట్నం తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఇక జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చినగంజాం పల్లిపాలెం తీరం వెంబడి అలల తాకిడి ఉధృతమైంది. కొల్లూరు మండలం తోకలవానిపాలెంలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. గ్రామపంచాయతి కార్యాలయం నీటమునిగింది. ఉధ్రుతమైన గాలుల వల్ల పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నది. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం వస్తున్నది. కాకినాడ, పిఠాపురం, పెద్దపురంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జగ్గంపేట, పత్తిపాడు, తుని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఈదురుగాలులతో పలు మండలాల్లో వరిపంట నేలకొరిగింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసి ముద్దయ్యాయి.
నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలోని 9 మండలాల్లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. నెల్లూరు, కావలి, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. వర్షం, ఈదురుగాలులతో చలి తీవ్రత పెరిగిపోయింది.
విజయవాడలో రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతున్నది. దీంతో ఇంద్రాకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాత్రి వర్షం కురుస్తున్నది. దీంతో అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లా దివిసీమలో ఎడతెరపిలేకుండా వర్షం పడుతున్నది. నాగాయలంకలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం వస్తున్నది. దీంతో వేల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఒక్కో గేటును ఎత్తి టీటీడీ అధికారులు నిటిని విడుదల చేస్తున్నారు.
రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది.
సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీచేసింది.