శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురంలో చనిపోయిన డాక్టర్ అక్షితది హత్యగా పోలీసులు తేల్చారు. ఆమె వెంట వచ్చిన వ్యక్తే ఆమెను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గొంతు నులమడం వల్ల చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. వరంగల్కు చెందిన డాక్టర్ అక్షిత.. ఏడాది కూతురు, ఇంటీరియర్ డిజైనర్ మహేశ్ వర్మతో కలిసి హిందూపురానికి వచ్చారు. స్థానిక లాడ్జిలో దిగిన ఆమె చనిపోయిందని ఆమెతో వచ్చిన వ్యక్తే పోలీసులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మెదక్ జిల్లా పటాన్చెరువుకు చెందిన మహేశ్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హిందూపురంలోని ఓ లాడ్జిలో డాక్టర్ అక్షిత బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మధ్యాహ్నం భోజనం చేసి ఇద్దరం నిద్రపోయామని, లేచి చూడగా ఆమె చనిపోయి ఉన్నదని పోలీసులకు కట్టుకథ చెప్పాడు. దాంతో పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం చేరవేసి.. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ వైద్యాశాలలో భద్రపరిచారు. కాగా, మహేశ్వర్మను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించడంతో హత్య వ్యవహారం బయటపడింది.
ములుగు జిల్లా మంగపేటకు చెందిన అక్షిత.. ప్రస్తుతం కర్నాటకలోని చిక్బళాపూర్ మెడికల్ కాలేజీలో డీఎన్బీ రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈమె భర్త వరంగల్లో ఆర్థోపెడిక్ వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. పెండ్లై ఏడాది వయసున్న కుమార్తె ఉన్న డాక్టర్ అక్షిత.. మహేశ్వర్మతో కలిసి హిందూపురం ఎందుకు వచ్చారన్నది తెలియాల్సి ఉన్నది. ఆమెను ఎలా, ఎందుకు చంపాడనే విషయంపై పోలీసులు ఇంకా విషయాలు వెల్లడించలేదు.