Araku | పొత్తులో భాగంగా అరకు టికెట్ను బీజేపీకి కేటాయించడం పట్ల టీడీపీ నేత దొన్ను దొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘ నేను, నా భార్య, కుమారుడు అందరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.కానీ చివరి క్షణంలో మా కుమారుడితో కలిసి మరోసారి ఆలోచన చేశాం. మనం చనిపోతే మనపై నమ్మకం పెట్టుకున్న కార్యకర్తలు ఏమైపోతారని ఆలోచించాం. కార్యకర్తల భవిష్యత్తు ఆలోచించి ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నా’ అని అరకు టీడీపీ ఇన్ఛార్జి దొన్నుదొర ఆవేదన వ్యక్తంచేశారు.
అరకులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు అప్పులు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించానని దొన్నుదొర తెలిపారు. పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశానని అన్నారు. దీనివల్ల తీవ్ర అప్పుల్లో కూరుకుపోయానని తెలిపారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని.. కాకపోతే ఆత్మహత్య సరికాదని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు. ఎవరు ఆదరిస్తే వారికి మద్దతిస్తామని తెలిపారు. లేదంటే ఇండిపెండెంట్గా పోటీలో ఉంటానని ప్రకటించారు.