అమరావతి : అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు హిందూపురం పట్టణం నుంచి అనంతపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ .. హిందూపురం పట్టణంలో అన్ని వసతులు ఉన్నాయని హిందూపురాన్ని కాదని మరో ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే సహించబోమని అన్నారు. ఇంతకు ముందు ప్రకటించిన విధంగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రజల న్యాయమైన డిమాండ్ను సాధించేవరకు ఎంతటి పోరాటాలకైనా రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం తమ మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా హిందూపురంను ప్రకటించాలని అన్నారు. అవసరమైతే సీఎం అపాయింట్మెంట్ను తీసుకుని వినతి పత్రం అందజేస్తామని అన్నారు. హుటాహుటినా రాత్రికే రాత్రి జిల్లాల ఏర్పాటు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాజకీయ ఉద్ధేశంతోనే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని ఆరోపించారు.