అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతగా 8 మేజర్ ఆలయాల్లో ఈ ఆన్లైన్ సేవలు లభించనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇకపై భక్తులు ఆన్లైన్ మోడ్ ద్వారా గదులు, దర్శన టిక్కెట్లు, సేవాలు, ఈ-హుండీ, ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చు.
వెలగపూడిలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ఆలయాల్లోనూ దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తామని తెలిపారు. శ్రీశైలం దేవస్థానంలో ఇప్పటికే సాంకేతిక సంస్థ సహకారంతో ఆన్లైన్ సేవలను చేపట్టామన్నారు. శ్రీశైలంలో ఆన్లైన్ సేవలు విజయవంతంగా అందిస్తుండటంతో ఇప్పుడు అదే సంస్థ ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా ఆన్లైన్ సేవలను ఉచితంగా అందజేసే పనిని చేపట్టింది.
విజయవాడ కనకదుర్గ ఆలయంలో రానున్న దసరా పండుగ నుంచి ఆన్లైన్ బుకింగ్ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలు ఆలయాల్లో కూడా ఆన్లైన్ సేవలు మరో ఐదారు రోజుల్లో ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆలయ భూములు, ఆభరణాలపై జియో ట్యాగింగ్ చేయనున్నామన్నారు. ఆలయాల్లో ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నామని, దీనివల్ల ఎలాంటి అవినీతికి తావులేకుండా పోతుందని వెల్లడించారు. కాగా, భక్తుల సేవలు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా కొనసాగుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.