శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేదపండితులు, అర్చకులచే వేదమంత్రోఛ్చారణల మధ్య మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్త పూజలు జరిపించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. దివ్యకాంతులను ప్రసరింపజేస్తు భక్తులకు వరాలిచ్చే స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పుష్పోత్సవాన్ని జరిపించారు.
అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్రగులాబీలు, మందారం, ఊదగన్నేరు, దేవగన్నేరు వంటి 18 రకాల ప్రత్యేక పూష్పాలు.. జామ, ఖర్జూర, నల్లద్రాక్ష వంటి 9 రకాల పండ్లతో పాటు బిల్వం మరువం మాచీ పత్రితో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆ తరువాత విశేషాలంకరణ చేసిన స్వామివార్ల శయనమందిరంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించినట్లు ఈవో చెప్పారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కళాకారులతో పాటు ఆలయ అధికారులను, సిబ్బందిని అభినందించారు. క్షేత్ర పరిధిలో చేసే ప్రతి పనిని స్వామి అమ్మవార్ల సేవగా భావించి చేయడంతో వారి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. అశ్వవాహనోత్సవంలో ఈఈ మురళీ, అసిస్టెంట్ నటరాజ్, ఏఈవోలు ఫణీదర్ ప్రసాద్, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను నవ సమాజానికి అర్థమయ్యే విధంగా శివలీలలు నాటాకాన్ని శ్రీ మల్లికార్జున నాట్యమండలి వారు ప్రదర్శించగా, శ్రీగోదా నరసింహరావు భక్తరంజని బృందం ఆలపించిన గీతాలాపన చేశారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన జానకి, బృందం వారు చేసిన సంప్రదాయ నృత్యాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషమని పీఆర్వో శ్రీనివాస్ రావు తెలిపారు.