తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి (Padmavati) అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) వైభవంగా జరిగింది. వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి తీసుకువచ్చి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు.
భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆలయ అర్చకులు శ్రీనివాసన్ తెలిపారు. 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు.
టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 20 మంది సిబ్బంది, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 20 వేల కట్ ఫ్లవర్స్ తో ఐదు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సుందరంగా అలంకరించారు.
ఇందులో తమలపాకులు, అపిల్, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్, మొక్కజొన్న, పైనాపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు.మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman)దంపతులు , జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత, భక్తులు పాల్గొన్నారు.