Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మ వార్లకు శాస్త్రోక్తంగా మాఘమాస పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరిపామని దేవస్థానం ఈవో ఈవో లవన్న తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను పల్లకిలో ఆశీనులను జేసి క్షేత్ర ఆలయ ప్రదక్షణ, అటుపై క్షేత్ర గిరిప్రదక్షిణ చేశారు. గంగాధర మండపం నుండి నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా సాగిన గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు, యాత్రికులు, అర్చక వేదపండితుల శివ నామస్మరణతో మహాక్షేత్రం మార్మోగింది.
పౌర్ణమి సంధ్యా సమయంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారికి అర్చకులు లక్ష కుంకుమార్చన చేశారు. అటుపై ఊయల సేవ, పల్లకి సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసిన అర్చకులు అష్టోత్తర నామావళి పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఈవో హరిదాసు తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈవో లవన్న అన్నారు. నిత్య ఆర్జిత సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్ష కుంకుమార్చనలో భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారన్నారు. భక్తులు www.srisailadevasthanam.org ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
శ్రీశైల మహా క్షేత్ర దక్షిణ ద్వారమైన కడప జిల్లా జ్యోతి సిద్దవటంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే జ్యోతిస్సిద్దేశ్వరస్వామి, కామాక్షి అమ్మవార్ల లీలా కళ్యాణం ఘనంగా జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. శ్రీశైల దేవస్థానం అనాదిగా ఆచరిస్తున్న ఆనవాయితీ ప్రకారం సిద్దవట క్షేత్ర ఆది దేవులకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కుంకుమార్చనలు చేసి ఆగమశాస్త్ర ప్రకారం కళ్యాణం నిర్వహించారు. ఈ కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు చెప్పారు.
ప్రధానంగా లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ సమస్త భూమండలంతోపాటు శ్రీశైలక్షేత్ర వర్ణనతో మహాసంకల్పం పఠించిన తరువాత గణపతిపూజ, కంకణధారణ, యఙ్ఞోపవీతధారణ, గౌరీపూజ, వరపూజ, స్వామి అమ్మవార్ల ప్రవర, మంగళాష్టకాలను వల్లిస్తూ స్వామి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం తలపై ఉంచి మాంగళ్యధారణ జరిపించారు. స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాల కొంగులు ముడి వేసి ఆశీర్వచనం చేసిన తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి పల్నాడు వాసి కొత్త కోటేశ్వరరావు తన మిత్రులతో కలిసి రూ. లక్ష విరాళం అందించారు. ఈ మేరకు ఆదివారం ఏఈవో ఫణీంద్రప్రసాద్కు కోటేశ్వర రావు చెక్ రూపంలో విరాళం అందజేశారు. అటుపై దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల ప్రత్యేక దర్శనం కల్పించారు. తదుపరి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.