తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం ఆస్థానం, వనభోజనం కార్యకమ్రాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ డప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.