అమరావతి : టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్ల బదులు లిక్కర్ మాత్రం ఇచ్చిందని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సారా మరణాలపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసనలపై ఆమె మాట్లాడారు. ఎనీటైమ్ మందు దొరికేలా చంద్రబాబు పాలన కొనసాగిందని దుయ్యబట్టారు. మద్యం కమీషన్ల కోసం మద్యాన్ని ఏరులై పారించారని ఆమె అన్నారు. బడి, గుడి తేడా లేకుండా బెల్టు షాపులు పెట్టించారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్కు సూచించారు. నాడు ఎన్టీఆర్ మద్యపాన నిషేదం విధిస్తే చంద్రబాబు బెల్టు షాపులు తెరిచారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్టు షాపులను రద్దు చేసిందని గుర్తు చేశారు. మద్యపానం రేట్లు పెంచితే తగ్గించాలని టీడీపీ నిరసనలు చేసిందని విమర్శించారు. సహజ మరణాలను కల్తీసారాకు లింకు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశం మొదలవగానే టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస మరణాలపై చర్చించాలని పట్టు బట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమకు చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు. టీడీపీ పక్షనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు తమ వద్ద ఉన్న కాగితాలను చింపివేసి స్పీకర్పై పడవేశారు. దీంతో సమావేశాన్ని రెండు సార్లు వాయిదా వేసి తిరిగి ప్రారంభించారు. సరైన ఫార్మాట్లో వస్తే చర్చకు సిద్ధమని ప్రభుత్వం తరుఫున స్పీకర్ పేర్కొనగా ఈరోజే చర్చించాలని పట్టుబట్టారు.