గుంటూరు: విద్యతోపాటు ఉన్నత విలువలను ఒంట బట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. వీటితోపాటు క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నైతికత, దేశభక్తి పెంపొందించుకోవడం ద్వారా ఉన్నతస్థానాలకు చేరుకోగలమని ఆయన చెప్పారు.
మంగళవారం గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
సమాజం, దేశ పురోగతికి విద్యార్థులకు సరైన విద్యనందించడం బలమైన పునాదులు వేస్తుందని వెంకయ్యనాయుడు చెప్పారు. విద్య వ్యక్తిని విజ్ఞానవంతుడిగా చేయడంతోపాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడిగా మలుస్తుందని పేర్కొన్నారు. దేశానికి నాయకత్వం వహించే సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యంగా, యువతకు జాతీయ భావాలు నూరిపోసి, నైపుణ్యం, లక్ష్యం, చిత్తశుద్ధి ఉన్న దేశభక్తులుగా వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ వంటి వాటి పట్ల జాగృతం చేయాలన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకోండి, కానీ మాతృభాషను మాత్రం మర్చిపోవద్దని సూచించారు. రేపటి ప్రపంచం మీరు ఎవరని ప్రశ్నిస్తే, మీ మాతృభాషే మీకు సమాధానాన్ని చూపుతుందన్నారు.
పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉన్నదన్న ఉపరాష్ట్రపతి.. ‘మానవ సేవే మాధవ సేవ’ అని త్రికరణ శుద్ధిగా నమ్మి, జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత దేశభక్తుడిగా పాటిబండ్ల జీవితం గురించి విద్యార్థులకు తెలియజెప్పారు. ఆయన జీవితాన్ని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముందు పాఠశాల ఆవరణలో స్మృతి చిహ్నాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ, నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు, పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల అధ్యక్షుడు గంటా సుబ్బారావు, కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్థన్ తదితరులు పాల్గొన్నారు.