తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి (మంగళవారం)నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తిక బ్రహోత్సవాలను పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవను సోమవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్చువల్ విధానం ద్వారా నిర్వహించిన పూజలో 413 మంది గృహస్తులు పాల్గొన్నారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసిన అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు.
టీటీడీ జేఈవో వీరబ్రహ్మంమాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ముందురోజు లక్షకుంకుమార్చన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పారు.
మంగళవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.