నెల్లూరు : త్వరలో జరుగనున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కుమ్మరి కొండయ్య తెలిపారు. వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటున్నాడీ పెద్దాయన. 1987 నుంచి ఇవాల్టి వరకు క్రమం తప్పకుండా సర్పంచ్ మొదలు ఎంపీ ఎన్నికల వరకు అన్నింటా పోటీ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఈయన. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎన్నికల్లో నామినేషన్ ఖర్చులను భిక్షాటన చేసి మరీ సంపాదిస్తుంటాడు.
కుమ్మరి వృత్తిలో ఉన్న కొండయ్య పేరు ఏపీ రాజకీయ నేతలకు సుపరిచితమే. ఇప్పటివరకు 21 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పెద్దాయన.. ఈసారి ఆత్మకూరు బైపోల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కుమ్మరి కొండయ్య, ఎలక్షన్ కొండయ్యగా చిరపరిచితుడైన ఈ సీనియర్ సిటిజన్.. త్వరలో జరిపే ఆత్మకూరు ఉప ఎన్నికతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నాడు. 1987 లో తొలిసారి పోటీ చేసినప్పుడు తన కులవృత్తి అయిన కుండ గుర్తు వచ్చిందని, ఈసారి కూడా అదే గుర్తుపై పోటీ చేస్తానంటున్నాడు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా.. 13 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఒక స్వతంత్రుడు నామినేషన్ ఉపసంహరించుకోగా.. 14 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండగా.. బీజేపీ తన అభ్యర్థిగా భరత్ను రంగంలోకి దించింది. వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి పోటీ చేస్తున్నారు.