మచిలీపట్నం : లోన్ యాప్ రుణాలు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేసిన కేసులో కృష్ణా జిల్లా పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రుణం తీసుకున్న ఇద్దరు వ్యక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్ల బారిన పడొద్దని, మోసగాళ్లకు దూరంగా ఉండాలని ఎస్సీ జాషువా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రుణాల పేరిట వేధింపులకు గురిచేసే వారి సమాచారాన్ని సైబర్ క్రైమ్ నంబర్ 1930 లో గానీ, సైబర్ మిత్ర 9121211100 నంబర్లోగానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.
లోన్ యాప్ వేధింపుల కేసులో అరెస్టు అయిన వారి వివరాలను కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పీ జాషువా మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పరిధిలోని ఓ మహిళకు రుణం ఇస్తామంటూ ఫోన్ మెసేజ్ వచ్చింది. మెసేజ్లో పేర్కొన్న యాప్ను డౌన్లోడ్ చేసి రూ.7 వేల రుణం ఈ ఏడాది జూలై 20 న తీసుకున్నది. లోన్ తీసుకున్న వారం రోజులకే ఈఎంఐ చెల్లించాలంటూ ఆమెను వేధించడం ప్రారంభించారు. ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి యాప్ ద్వారా ఆమె బంధువులు, స్నేహితులతో షేర్ చేయడం మొదలుపెట్టారు. దాంతో సదరు మహిళ 2022 ఆగస్ట్ 9 న పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్ 420 ఐపీసీ, 66-డీ, 66-బీ, ఐటీ యాక్ట్ 2000 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లాలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళ కూడా రుణ యాప్ నిర్వాహకుల నుంచి ఇలాంటి వేధింపులనే ఎదుర్కొన్నది. ఓ మహిళ రూ.3,360 అప్పు తీసుకున్న కొద్దిసేపటికే రూ.7వేలు చెల్లించాలంటూ ఫోన్ చేసి చెప్పారు. ఆమె అలా చెల్లించకపోవడంతో సదరు మహిళల మార్ఫింగ్ చిత్రాలను ఆమె స్నేహితులు, బంధువులకు షేర్ చేసి అనవసర వ్యాఖ్యానాలు చేశారని ఆత్కూరు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. దాంతో ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని తేలడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నలుగురు వ్యక్తులు నీలేష్ విలాస్ గోరాడే (29), అమిత్ సునీల్ గావ్లీ (31), సర్ఫరాజ్ అజీజ్ షేక్ (32), రాందాస్ దత్తాత్రేయలను అదుపులోకి తీసుకున్నాయి.