తిరుపతి : శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు జులై 3నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7.30 నుంచి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిపారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరిండెంట్ చంగలరాయులు, అర్చకులు పాల్గొన్నారు