Kodikathi Srinu | విజయవాడ : వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాస్ రావు(కోడికత్తి శ్రీను) జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ జైభీమ్ పార్టీ కండువా కోడికత్తి శ్రీనుకు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా జనిపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. తాను పేదల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. కులం కోసమో, మతం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చట్టసభల్లో అడుగుపెట్టి పేదల సమస్యలు తీర్చాలని భావించి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దగాపడిన శ్రీనివాసరావు దళిత, రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ చెప్పారు.
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ గత నెలలో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఐదేళ్లుగా నిందితుడు రిమాండ్లో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్పై దాడి జరిగింది. 2023 వరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారిస్తున్న కోడికత్తి కేసును విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసులో సాక్ష్యం ఇవ్వాల్సిందిగా పలుమార్లు సీఎం జగన్కు నోటీసులు జారీ చేసినా రకరకాల కారణాలతో హాజరుకాలేదు.