అమరావతి: ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం పట్ల మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపితే వారంతా నారా లోకేవ్, పవన్ కల్యాణ్ మాదిరిగా తయారవుతురని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్ష రాసి పాస్ కావాలని తమ ప్రభుత్వం చెప్తుందని, అయితే ప్రతిపక్షాలు గ్రేస్ మార్కులు కలపాలని డిమాండ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
పదో తరగతి విద్యార్థులతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ రసాబాసగా మారింది. విద్యార్థులతో మాట్లాడుతుండగా జూమ్ మీటింగ్ మధ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్రత్యక్ష్యం కావడంతో నిర్వాహకులు వారి కాల్ కట్ చేశారు. దాంతో జూమ్లో కాదు.. వారితో నేరుగా మాట్లాడేందుకు నేను సిద్ధమని నారా లోకేశ్ సవాల్ విసిరారు.
ఫలితాలను కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూసే దౌర్భాగ్యులు ఉన్నారని మండిపడ్డారు. ఏమీ తెలియని చిన్నారులకు ఏవేవో చెప్పి వారు ఆత్మహత్యలు చేసుకునేలా టీడీపీ నేతలు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. చిన్నారుల జీవితాలతో ఆటలాడుకోవద్దని, అలా వారిని ఉసిగొల్పవద్దని చెప్పడానికే తాను జూమ్ మీటింగ్కు వచ్చానని కొడాలి నాని చెప్పారు. అయితే, తాను చెప్పేది వినకుండా నిర్వాహకులు జూమ్ మీటింగ్ కాల్ కట్ చేశారని తెలిపారు. కరోనా కారణంగా విద్యార్థుల్లో గ్రహించే సామర్ధ్యం తగ్గిపోయి పెద్ద సంఖ్యలో ఫెయిల్ అయ్యారని, దీనిని కూడా తమ ప్రభుత్వం వైఫల్యంగా అంటగట్టాలని చూడటం దుర్మార్గమన్నారు.