అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినేట్ (AP Cabinet) కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీకి ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులతో డీఎస్పీ నోటిఫికేషన్(DSC notification )జారీకి గ్రీన్ సిగ్రల్ ఇచ్చింది. వీరికి రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోద ముద్ర తెలిపింది.
పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీతో పాటు అటవీశాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులు, ఏపీ పబ్లిక్ సర్వీసులు నియామక, నియంత్రణ చట్ట సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయవాదుల సంక్షేమ(Advocate Welfare )చట్ట సవరణ, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపింది. డిజిటల్ ఇన్ఫ్రాకంపెనీని రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు ఓకే చెప్పింది. అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం తెలిపింది. ఎమ్మెల్యేకు ఇళ్ల స్థలాల అంశాలపై చర్చించేందుకు సీఎం సుముఖుత వ్యక్తం చేయకపోవడంతో ఆ అంశం వాయిదా పడింది.