Kandula Durgesh | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను విమర్శించే అర్హత మాజీ మంత్రి రోజాకు లేదని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. పవన్ కల్యాణ్ నటుడిగా గతంలో విమానాల్లో తిరిగారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా విమానాల్లో తిరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
జబర్దస్త్లో డ్యాన్స్ వేసి రోజా చేసిందేమిటి అని కందుల దుర్గేశ్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ 90 శాతం ప్రజలకు సేవ చేస్తుంటే, కేవలం 10 శాతం మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్కు మీలా కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయా అని నిలదీశారు. పవన్ కల్యాణ్కు సినిమాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని కందుల దుర్గేశ్ మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో చేపట్టిన కాలేజీల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తవుతుందని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులపై పూర్తి అజమాయిషీ చేసేహక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. పీపీపీ మోడ్ను ప్రతిపక్ష నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. వైసీపీహయాంలో మొదలుపెట్టిన ఏ భవనం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో 10,644 కోట్ల రూపాయలతో 15 నెలల్లో పర్యాటక రంగానికి పెట్టుబడులు సాధించామని కందుల దుర్గేశ్ తెలిపారు. వీటి ద్వారా 8080 మందికి వీటి ద్వారా ఉపాధి లభించిందని పేర్కొన్నారు. రూ.698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులను ప్రారంభించామని చెప్పారు. వీటి ద్వారా 3554 మందికి ఉపాధి లభించిందని అన్నారు. దేశంలో పర్యాటక అభివృద్ధిలో పది రాష్ట్రాలుగా ఒకటిగా ఏపీ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఐదేళ్లలో 25 వేల కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో టూరిస్టుల కోసం హోటల్స్ను పెంచాలని నిర్ణయించామని చెప్పారు.