తిరుపతి: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై ఉదయం 7.35 నుంచి 8.30 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి విహరించారు. కొవిడ్ నిబంధనల కారణంగా స్వామి వారి వాహన సేవలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
సర్వభూపాల అంటే రాజులకు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెప్తూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్టించారు. ఇలాఉండగా, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం వాహన సేవలో జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజీ రంగచార్యులు, తదితరులు పాల్గొన్నారు.