హైదరాబాద్ : విజయవాడ కేంద్రంగా ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిన్న ఏపీ అసెంబ్లీలో సవరణ బిల్లును తీసుకొచ్చిన జగన్ సర్కార్.. ఆ మేరకు బిల్లును ఆమోదింపజేసుకున్నది. దాంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్తా డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు ఈ వివాదం హైదరాబాద్ను కూడా తాకింది. కూకట్పల్లిలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన ప్రదర్శనకు దిగారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కాగా, హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చడంపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించుకున్న గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అని పేర్కొన్నారు. నెటిజెన్లు ఈ ట్వీట్ను ఇప్పటివరకు 10 వేలకు పైగా రీట్వీట్ చేసి తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022