Srisailam | జూలైలో శ్రీశైలం దేవస్థానంలో అర్జిత సేవలు, శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఈ టికెట్లను భక్తులు దేవస్థానం వెబ్ సైట్ www.srisailadevastanam.org ద్వారా ముందస్తుగా పొందొచ్చు. వారాంతపు రోజులు, సెలవు రోజులు, సోమవారం వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆన్ లైన్ ద్వారా టికెట్లు దొరకని భక్తులు టికెట్ అందుబాటులో ఉండే మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో ఆయా టికెట్లు పొందొచ్చు. భక్తుల సౌకర్యార్థం. టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి గంట ముందే భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు.
శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం, శ్రీ స్వామి వార్ల గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు, గణపతి హోమం, రుద్ర హోమం, మ్రుత్యుంజయ హోమం, చండీ హోమం, శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం, శ్రీ వ్రుద్ధ మల్లిఖార్జున స్వామి వార్ల అభిషేకం, సర్పదోష నివారణ పూజ తదితర అర్జిత సేవా టికెట్లను భక్తులు ఆన్ లైన్ లో పొందొచ్చు.
ఆయా సేవా టికెట్లు పొందిన భక్తులు విధిగా ఆన్ లైన్ ద్వారా పొందిన టికెట్ ప్రతి, ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ ప్రతి తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని ఈఓ లవన్న కోరారు. ఆయా సేవా టికెట్లు స్కానింగ్ చేసి సంబంధిత టికెట్లను ఆధార్ గుర్తింపు కార్డులతో సరి చూసిన తర్వాతే భక్తులను ఆయా ఆర్జిత సేవలకు అనుమతిస్తామని తెలిపారు. కనుక అర్జిత సేవలు జరిపించే భక్తులు, ఆయా అర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్ల లభ్యతకు అనుగుణంగా శ్రీశైల యాత్ర రూపొందించుకోవాలని తెలిపారు.
ఇక ప్రతి రోజూ ఉదయం 4.30 గంటల నుంచి మొదలయ్యే ఉచిత స్పర్శ దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. వారంలో నాలుగు రోజులు అనగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు భక్తులకు ఉచితంగా కల్పించే స్పర్శ దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. రూ.150 రుసుముతో శీఘ్ర దర్శనం, రూ.300లతో అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఆన్ లైన్ తోపాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందొచ్చు. వీటిల్లో 30 శాతం ఆన్ లైన్ లో ఇస్తుండగా, మిగతా 70 శాతం టికెట్లు కరంట్ బుకింగ్ లో విక్రయిస్తున్నారు.
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న గో సంరక్షణ శాలలో గోవులకు ఆదివారం వ్యాధి నిరోధక టీకాలు వేశారు. సోమవారం కూడా టీకా కార్యక్రమం కొనసాగుతుందని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి గోవులకు వచ్చే సీజనల్ వ్యాధులు గొంతు వాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి రాకుండా హెచ్ఎస్బీక్యూ టీకాలు వేస్తున్నారు. గోశాలతోపాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులంలో గల మొత్తం 800కి పైగా గోవులు, పెయ్య దూడలు, కోడెదూడలకు టీకాలు వేస్తున్నారు. నాలుగు నెలల కంటే ఎక్కువ వయస్సు గల దూడలకు టీకాలు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గోశాల పర్యవేక్షకులు బీ శ్రీనివాసులు, గుమస్తా బీ హనుమంతు, వెటర్నరీ అసిస్టెంట్లు జయరాముడు, నాగన్న, మనిషా తదితరులు పాల్గొన్నారు.