CJI NV Ramana | న్యాయమూర్తులు తమలో తమనే న్యాయమూర్తులుగా నియమించుకుంటున్నారన్న భావన ఒక పుక్కిటి పురాణం అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జ్యుడీషియల్ ఆఫీసర్ల ఎంపికలో న్యాయమూర్తుల ఎంపికలో ఉన్న పలు అంశాల్లో ఇదొకటని అన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, చివరకు సుప్రీంకోర్టు కొలీజియం సరైన అభ్యర్థిని న్యాయమూర్తిని ఎంపిక చేయడంలో భాగస్వామ్యం వహిస్తాయన్నారు. ఆదివారం ఆయన విజయవాడలోని సిద్ధార్థ లా కాలేజీలో ఇండియన్ జ్యుడీషియరీ- చాలెంజెస్ ఆఫ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఇటీవలి కాలంలో న్యాయమూర్తులపై భౌతిక దాడులు పెరిగిపోయాయని చెప్పారు. తమకు అనుకూలంగా తీర్పు రాకుంటే ప్రింట్, సోషల్ మీడియాలో సంఘటిత ప్రచారం జరుగుతున్నదన్నారు. ఇదంతా కొందరి ప్రోత్సాహంతో జరుగుతున్నట్లు కనిపిస్తున్నదని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థను సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాసిక్యూటర్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించడంతోపాటు వారిని కోర్టులకు జవాబుదారీ చేయాలని అన్నారు.