తిరుపతి : టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జేఈవో వీరబ్రహ్మం సోమవారం పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ఇంజినీరింగ్, ఆలయ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ ఆలయ గోపురానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆర్కియాలజీ విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఇందుకోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
పచ్చదనం పెంపు, తాగునీరు, ప్రసాద వితరణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. వివాహాలు చేసుకునేందుకు మండపం నిర్మించాలని అర్చకులు కోరారని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్చిల నిర్మాణం, కల్యాణవేదిక వద్ద వివాహాలు చేసుకునే సదుపాయం, రామకోటి స్థూపం తదితర అంశాలను ఈవో దృష్టికి తీసుకెళతామన్నారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణానికి సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లు చేపట్టి సిద్ధమవుతున్నామని, కోవిడ్ పరిస్థితులను అంచనా వేసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట టీటీడీ డిప్యూటీ ఈవో డాక్టర్ ఆర్.రమణ ప్రసాద్, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.