తెనాలి: ఆంధ్రప్రదేశ్లో ‘హ్యాష్గుడ్మార్నింగ్ సీఎంసార్’ క్యాంపెయిన్ను జనసేన చేపట్టింది. ఈ హ్యాష్ట్యాగ్తో ప్రజా సమస్యలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు జనసేన సిద్ధమైంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఆందోళనలకు జనసేన ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నది.
ఇటీవలి కాలంలో జనసేన విన్నూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. కౌలు రైతులకు భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగు ఆదివారాల పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనవాణి చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొంటున్నారు. తాజాగా ‘హ్యాష్గుడ్మార్నింగ్ సీఎంసార్’ అనే హ్యష్ ట్యాగ్తో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15,16,17 తేదీల్లో చేపట్టనున్నారు. ఈ విషయాన్ని తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
రాష్ట్రంలో రహదారులకు కనీస మరమ్మతులు చేపట్టడం లేదని, గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్ర లేపడానికే ‘హ్యాష్గుడ్ మార్నింగ్ సీఎం సార్’ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిజిటల్ క్యాంపెయిన్ లో స్వయంగా పవన్ కల్యాణ్ పాల్గొంటారని చెప్పారు. రోడ్ల దుస్థితిపై ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేయనున్నారు. పెట్రోల్ పైన రూ.750 కోట్ల మేర రోడ్ సెస్ వసూలు చేస్తూ కూడా రహదారులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం దృష్టికి రోడ్ల దుస్థితిని తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.