Janasena | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు వీలైనంత దగ్గరయ్యేందుకు వచ్చే రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి.. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేవిధంగా.. ఈ బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి రోజు మూడు సభల చొప్పున.. మార్చి నెలాఖరులోగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేశామని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ జోనల్ కమిటీతో నాదెండ్ల మనోహర్ సమావేశమై.. వారికి దిశా నిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలను విజయవంతం చేయాలని సూచించారు.
ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ జోన్-1, రాయలసీమ జోన్-2 ఇలా రాష్ట్రాన్ని ఐదు భాగాలుగా విభజించి.. ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలు వేశామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి.. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ సభలకు తరలివచ్చే లక్షలాది మంది అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు. అలాగే పవన్కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన సమయంలో.. ఆయనకు సమస్యలు చెప్పుకునేలా.. బాధితులతో మాట్లాడేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటాం
జనసేన పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన ప్రతి జన సైనికుడు, వీర మహిళలను పార్టీ గుర్తిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకిత భావంతో పనిచేసే నాయకులు చాలామంది పార్టీలో ఉన్నారని అన్నారు. వారిలో కొందరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉపయోగించుకున్నారని తెలిపారు. మరికొంతమంది పలు రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోయారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరినీ పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందని స్పష్టం చేశారు.