Pawan Kalyan | కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ పర్యటనలో భాగంగా కొణతాల ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో కొణతాల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాగబాబు రెండుసార్లు సమావేశమైనప్పటికీ కొణతాల దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కొణతాల రామకృష్ణను నాగబాబు కోరారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా కొణతాల ఇంటికి వెళ్లి సమావేశం కావడం ఆసక్తి రేకెత్తించింది.
అయితే ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కొణతాలతో సమావేశం మర్యాదపూర్వకంగానే అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించామని వెల్లడించారు. కాగా, తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్ఠానమే నిర్ణయిస్తుందని ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై మూడు పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. మూడో వంతు సీట్లు జనసేనకు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.