అమరావతి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనకు దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీ మిత్రపక్షమైన జనసేన.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్ హాజరవుతారని అంతా భావించారు. కానీ, మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశమైంది.
కాగా, ఇటీవల బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న పవన్.. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, ఇదే కార్యక్రమానికి కేంద్రం నుంచి మెగాస్టార్ చిరంజీవికి సైతం ఆహ్వానం అందింది. మాజీ మంత్రి హోదాలో చిరంజీవి హాజరయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఈ సభ కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సైతం కేంద్రం ఆహ్వానాలు పంపింది. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు.