అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అతడి సోదరి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఎక్స్ ట్విటర్ ద్వారా మరోసారి వ్యంగస్త్రాలు సంధించారు. విశాఖ ప్రజలను మోసం చేసేందుకు విశాఖ విజన్(Visaka Vision) పేరిట కొత్త నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ విజన్ గళం ఎత్తుకుంటున్నాడని దుయ్యబట్టారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్తూ పాలనను ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు.
ఆంధ్రుల తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజనంటూ మండి పడ్డారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికలని , ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా.. చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాపని ఆరోపించారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని పేర్కొన్నారు.