విజయవాడ: అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాన్స్టాప్ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా అభివర్ణించిన జగన్.. అమరావతి భూములను ఎకరం రూ.10 కోట్లకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిగా అమరావతిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేసిన తీరును గుర్తుచేశారు.
అమరావతి ప్రాంతం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్నదని, రాజధాని భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని జగన్, ఆయన పార్టీ నేతలు రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ చెప్పారు. ఇప్పుడు అదే వైసీపీ నేతలు అమరావతి భూములను అధిక ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రానికి, రాజధానికి వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి పన్నిన కుట్రలు, కుతంత్రాలకు అంతు లేకుండా పోయిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటూ ప్రజలను జాగృతం చేస్తామని తెలిపారు.
జగన్ కాపు వ్యతిరేకి: ఎమ్మెల్యే సత్యప్రసాద్
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అంతులేని అవమానాలు, ద్రోహాలపై టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మాటికీ జగన్ కాపు వ్యతిరేకి అని చెప్పారు. గతంలో విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసిన జగన్.. ఇప్పుడు కాపు నేస్తం కూడా నిలిపారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే కాపులకు నిజమైన న్యాయం జరిగిందన్నారు.