కడప: ప్రస్తుత రోజుల్లో ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ ఎంపిక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రసాయనాలు కలిగిన ఆహారాల వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని, ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గమని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం పులివెందులులోని ఏపీకార్ల్లో న్యూటెక్ బయోసైన్సెస్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని సీఎం జగన్ చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై ఎక్కువగా దృష్టి సారించాలని, గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరమని సూచించారు. ఆర్బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.
సేంద్రియ వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం తరపున అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం జగన్ ఇవాళ కడప జిల్లాకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లారు. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. జగన్ను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు అడ్డంకులు ఎదురయ్యాయి. నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్నందున పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.