అమరావతి : టీడీపీ పెత్తందార్ల పార్టీ అని, వారి కోసమే పార్టీ నడుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ చరిత్ర మొత్తం వెన్నుపోట్ల సిద్ధాంతమని విమర్శించారు. గుంటూరులో నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీ రెండోరోజు ముగింపు సమావేశంలో జగన్ మాట్లాడారు. 44 ఏండ్ల రాజకీయ జీవితం, 14 ఏండ్లుగా ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు మంచిపాలన చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని విమర్శించారు. మంచి చేసేందుకు చంద్రబాబు చేతి వేలు ఉంగరంలో డిజిటల్ చిప్ పెట్టుకుంటే సరిపోదని మంచి మనస్సు, మంచి గుండె నుంచి రావాలని సెటైర్లు వేశారు.
టీడీపీ నాయకులు వారివారి పిల్లలను, మనువల్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివిపించి పేదల కోసం వైసీపీ ప్రభుత్వం నెలకొల్పుతున్న ఇంగ్లిష్ మీడియం వద్దంటూ నానా యాగి చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అక్రమ కేసులు బనాయించి తనను కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించారని ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకున్న పార్టీని దేవుడు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేశారని కాంగ్రెస్ను ఉద్దేశించి పేర్కొన్నారు.
13 ఏళ్ల క్రితం అసెంబ్లీలో ఒకడితో ప్రయాణమైన ప్రయాణం నేడు 151కి చేరుకుందని, ఎంపీల ప్రయాణం 22కు చేరుకుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం జన్మభూమి పేరిట కమిటీలు వేసి ప్రజల సొమ్మును దోచుకుందని విమర్శించారు. ఏపీ వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్లీనరీ తీర్మానం చేసింది.