అమరావతి : తనను దత్తపుత్రుడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సీబీఐ దత్తపుత్రుడంటా అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యనించారు. చంచల్గూడ షటిల్ టీమ్ నుంచి వచ్చినవారు కూడా నీతులు చెబుతారా అని జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేతలో భాగంగా ఏలూరుజిల్లా చింతలపూడిలో జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సొంతవారు ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు దత్తతకు వెళ్తారని ప్రశ్నించారు.
అహంకారంతో విర్రవీగితే ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలు పట్టించుకోక పోవడంతో మూడువేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతు ఆత్మహత్యలో ఏపీ మూడోస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానముందని ఆరోపించారు. రైతులు అధిక వడ్డీ తీసుకుని పంటలు పండిస్తున్నారని అయితే వాతావరణం, ప్రభుత్వం రైతులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు, 6 మంది రాజ్యసభ్యులు ఉన్న వారు కౌలు రైతులకు అండగా ఉంటే తాము రోడ్లపైకి వచ్చేవారం కామన్నారు. పాదయాత్రలు చేసి అందరినీ దగ్గరకు తీసుకుంటే సరిపోదని అధికారం చేతిలో ఉన్నప్పుడు పేదల కన్నీళ్లు తుడవలేకపోతే కచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో పోలీసు వ్యవస్థ కూడా విసుగెత్తి పోయిందని అన్నారు. పాలనలో వైసీపీ ఘోరంగా విఫలమైందని అన్నారు. తాను రాత్రికి రాత్రి అధికారంలోకి రావాలని నా ఉద్దేశ్యం కాదని ఇటుక ఇటుక పేర్చి రావాలని నా నిర్ణయమని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా కావాలన్నది ప్రజల నిర్ణయం ప్రకారమే జరుగుతుందని అన్నారు.