అమరావతి : న్యాయం కోసం దీక్ష చేపట్టిన సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం మానవీయతకు మాయని మచ్చగా మిగిలిపోతుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెనుమూరు మండలానికి చెందిన రైతు రత్నం నాయుడు ప్రభుత్వ అలసత్వానికి బలైపోవడం దురదృష్టకరమని అన్నా రు. న్యాయస్థానం ఉత్తర్వులను అధికారులు పాటించినట్లయితే ఒక బడుగు రైతు ప్రాణాలు పోయి ఉండేవి కావని అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి ఉంటే ఒక రైతు ప్రాణం నిలబడి ఉండేదని పేర్నొన్నారు.
ఈ ఘటనకు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్య పరమార్ధం కలుషితమవుతుందని వెల్లడించారు. తనకున్న కొద్దిపాటి భూమి కోసం పోరాటి ప్రాణాలు కోల్పోయిన రత్నం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్కల్యాణ్ తెలిపారు.