తిరుపతి : టీటీడీ ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు స్మార్ట్ కార్డుల జారీని టీటీడీ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు జేఈవో సదా భార్గవి పర్యవేక్షణలో స్మార్ట్ కార్డుల జారీ పూర్తయ్యిందని తెలిపారు. మొత్తం 6,597 మంది ఉద్యోగులకు ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సాంకేతికతో కూడిన స్మార్ట్ కార్డులతో పాటు ఫ్యామిలీ కార్డును అందించామని వెల్లడించారు.
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరిజ్ఞానం ద్వారా ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని స్మార్ట్ కార్డులో పొందుపరిచామని, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా స్మార్ట్ కార్డులను అందజేశామని పేర్కొన్నారు. టీటీడీ కార్యాలయాల్లోకి ప్రవేశానికి, టీటీడీ ఆలయాల్లో దర్శనానికి, ప్రతినెలా లడ్డూలు పొందేందుకు, క్యాలెండర్, పంచాంగం పొందేందుకు, వైద్య వసతులు తదితర సౌకర్యాలు ఈ కార్డు ద్వారా పొందవచ్చని స్పష్టం చేశారు.