విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సీబీఐ దత్తపుత్రుడు పాలన కొనసాగిస్తున్నారా? లేకా వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. రైతుల నుంచి నీటి తీరువాపై వడ్డీ వసూలు చేయడం దారుణమన్నారు. అసలే గిట్టుబాటు ధరలు రాక రైతులు ఇబ్బంది పడుతుంటే.. వడ్డీ వసూలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.
2018 నుంచి నీటి తీరువా లెక్కించిన ప్రభుత్వం.. రైతుల మెడలు వంచి 6 శాతం వడ్డీతో వసూలు చేయాలని నిర్ణయించడం కన్నా దారణమైన విషయం మరోటి ఉండదన్నారు. అసలు, వడ్డీ చెల్లించకపోతే రైతు భరోసా ఇవ్వమని, భవిష్యత్లో పంట నష్ట పరిహారానికి అనర్హులుగా చేస్తామని బెదిరించడాన్ని నాదెండ్ల తప్పుపట్టారు. ఇది ఏమాత్రం ప్రజాప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు కావాలన్నారు.
ఆస్తి పన్ను చెల్లించని పలు ఇళ్లకు తాళాలు వేసిన విషయం గత నెలలో చూశామని, ఇంట్లో సామాను తీసుకుపోతామని బ్యానర్లు కట్టి ట్రాక్టర్లు తిప్పారని నాదెండ్ల గుర్తు చేశారు. ఇప్పుడు తమ ప్రతాపాన్ని రైతులపై చూపేందుకు సిద్ధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారని, గ్రామాలవారీగా నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టారంటే.. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కోట్లు వడ్డీతో పాటు రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.