Kotamreddy Sridhar Reddy | నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మర్డర్ స్కెచ్కు సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్ సహా మరో నలుగురు మాట్లాడుకుంటున్న వీడియో తాజాగా బయటకొచ్చింది. దీంతో రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు అరుణతో కలిసి వైసీపీ నాయకులు ఈ మర్డర్ ప్లాన్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. కానీ ఆ వీడియోలో ఉన్న రౌడీషీటర్లు కోటంరెడ్డి బ్రదర్స్ అనుచరులే అని తెలుస్తోంది.
కోటంరెడ్డి బ్రదర్స్తో జగదీశ్, మహేశ్ ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వీరితో పాటు టీడీపీ క్రియాశీలక నేత రూప్కుమార్ యాదవ్ అనుచరుడు వినీత్ అని తెలుస్తోంది. కాగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ కోసం ఐదుగురు రౌడీషీటర్లు మాట్లాడుకుంటున్నట్లు బయటకొచ్చిన వీడియోలో.. ఫుల్లుగా మద్యం తాగి జగదీశ్, మహేశ్, వినీత్లు మరో ఇద్దరితో చర్చించినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. గదిలో మొత్తం ఏడుగురు ఉండగా, అందులో ఒక్కరే వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ ద్వారా జగదీశ్ పథకం రచించారని కోటంరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు కోటంరెడ్డి అనుచరులే అని తెలవడం గమనార్హం.
ఈ వీడియో వైరల్ కావడంతో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడియోలో ఉన్న అంశంపై తమ దృష్టిలో ఉందని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి విషయం చెబుతామని చెప్పారు. ఇక ఈ వీడియోపై ఎమ్మెల్యే కోటంరెడ్డి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కంటే కూడా తనకు తన ప్రాణాలే ముఖ్యమని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియో వైరల్
మద్యం తాగుతూ వీడియో తీసుకున్న రౌడీషీటర్లు
కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ సంభాషణ
వీడియోలో ఉన్న రౌడీషీటర్లు శ్రీకాంత్, జగదీష్, మహేష్, వినీత్ గా గుర్తింపు pic.twitter.com/Atoj8VhFga
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2025