IRCTC Saptagiri Tour Package | కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల-తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామితోపాటు కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా.. తక్కువ టైంలో ఈ దేవాలయాలన్నీ దర్శనం చేసుకోవాలని భావిస్తున్నారా.. అయితే, అటువంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కొత్త ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. యాత్రికులందరికీ ప్రయాణం ప్లస్ దర్శన భాగ్యం కల్పించేందుకు ‘సప్తగిరి’ పేరిట టూర్ ప్యాకేజీ సిద్ధం చేసింది.
తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ స్టేషన్ల నుంచి ఈ ప్యాకేజీ అమలవుతుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు కొనసాగే ఈ టూర్లో టికెట్ ధర రూ.5000 నుంచి ప్రారంభం అవుతుంది. వచ్చేనెల ఏడో తేదీ, 14వ తేదీల ప్రయాణానికి టికెట్లు సిద్ధంగా ఉన్నాయి.
కరీంనగర్లో (12762 నంబర్ రైలు) రాత్రి 7.15 గంటలకు బయలుదేరి.. పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా తిరుపతికి వెళుతుంది. రెండో రోజు ఉదయం తిరుపతికి చేరుతుంది. అక్కడ నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్కు తీసుకెళ్తారు.
యాత్రికులు ఆ హోటల్లో స్నానపానాదులు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాలను సందర్శించి తిరుపతికి చేరుకుంటారు.
మూడో రోజు శ్రీవారి దర్శనానికి ప్రత్యేక దర్శనం టికెట్లు అందజేస్తారు. ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అదే రోజు రాత్రి 8.10 గంటలకు 12761 నంబర్ రైలులో తిరుగు ప్రయాణం అవుతారు. నాలుగో రోజు ఆయా స్టేషన్లలో రైలు ఆగుతుంది. మీరు బయలుదేరిన స్టేషన్కు చేరుకోవడంతో మీ యాత్ర ముగుస్తుంది.
తిరుమలకు వెళ్లి రావడానికి 3 ఏసీ, స్టాండర్డ్ క్లాస్ రైలు టికెట్లు ఉంటాయి. ఏసీ గదిలో బస, ఏసీ రవాణా వసతి కల్పిస్తారు. రెండు రోజులు ఉదయం టిఫిన్ వసతి మాత్రమే ఐఆర్సీటీసీ కల్పిస్తుంది.
కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళ హస్తి, తిరుచానూరు, తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా టూర్ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. టూర్ గైడ్, ప్రయాణ బీమా సౌకర్యం కల్పించాలి. ఇక ఈ ఆలయాల్లో ఎక్కడైనా ఎంట్రన్స్ ఫీజు ఉంటే భక్తులే చెల్లించాలి. మరోవైపు, తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
స్లీపర్ బెర్త్ స్టాండర్డ్ క్లాస్లో సింగిల్ షేరింగ్కు రూ.7,120, ట్విన్ షేరింగ్ కోసం రూ.5,740, ట్రిపుల్ షేరింగ్ కోసం రూ.5,660, 5-11 ఏండ్ల మధ్య పిల్లలకు బెడ్ తోపాటు రూ.5,250, బెడ్ లేకుండా రూ.4,810 పే చేయాలి.
థర్డ్ ఏసీ బెర్త్ల్లో సింగిల్ షేరింగ్ రూ.9,010, ట్విన్ షేరింగ్ కోసం రూ.7,640, ట్రిపుల్ షేరింగ్ కోసం రూ.7,560 పే చేయాలి. 5-11 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లలకు బెడ్ తో కలిసి రూ.5,250, బెడ్ లేకుండా రూ.4,870 చెల్లించాలి.
ఒక వేళ ప్రయాణానికి 15 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిలేషన్ కింద ఒక్కో టికెట్ మీద రూ.250 మినహాయించుకుని మిగతా మొత్తం చెల్లిస్తారు. 14 రోజుల్లోపు అయితే 25 శాతం, ఏడు రోజుల్లోపు అయితే 50 శాతం మినహాయించుకుంటారు. నాలుగు రోజుల్లోపు క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ పేమెంట్స్ ఉండవని ఐఆర్సీటీసీ తెలిపింది.