అమరావతి : అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో నలుగురు కూలీలు మృతి చెందడం వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది. జిల్లాలోని రాయదుర్గం బొమ్మసహాల్ మండలం దర్గాహొన్నూర్లో దుబ్బన్న అనే రైతుకు చెందిన ఆముద పంటను కోసి ట్రాక్టర్ లో వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్తీగలు ట్రాక్టర్పై పడ్డాయి.
దీంతో ట్రాక్టర్ వద్ద ఉన్న మహిళలు కరెంట్ షాక్కు గురై నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. మృతులు పార్వతి, సక్రమ్మ, రత్నమ్మ, వండ్రక్కగా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.
గత మూడు నెలల క్రితం ఇదే జిల్లాలోని చిలకొండయ్యపల్లి గ్రామంలో జూన్ 30న 12 మందితో వెళ్తున్న ఆటోపై విద్యుత్ తీగలు పడ్డాయి. దీంతో ఆరుగురు వ్యవసాయ మహిళా కూలీలు దుర్మరణం చెందడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.